దారి చూపిన ధర్మాన !

పదవుల్లో ఉండగా విచారణ జరిపిస్తే ఆ సమయంలో పదవుల ప్రభావం చూపే అవ కాశం ఉంది. లేకపోతే మంత్రులను తొలగించాలి. ముఖ్యమంత్రి రోశయ్యకు ఇప్పుడు ఇదో సమస్య. సవాలు. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులపై వివిధ అవినీతి ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన మంత్రులే ఇప్పుడూ కొనసాగుతున్నారు. అప్పుడు కూడా అదే మంత్రులపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చిన ప్పటికీ, వైఎస్-మంత్రులు వాటిని ఎదురుదాడి ద్వారా తప్పించుకున్నారు. కానీ, రోశయ్య ముఖ్యమంత్రిగా వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మారిపోయింది.
ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం విమర్శల దాడి ఉధృతమయింది. వైఎస్ బంధువులు, ఆయన వర్గంగా ముద్రపడ్డ మంత్రుల అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్న ప్రాంతాలకు వెళ్లి మరీ ధర్నాలు చేపడుతోంది. మళ్లీ అక్కడి నుంచి వచ్చి సీఎంను ఎమ్మెల్యేలతో కలసి వాటిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తోంది. చర్యలు తీసుకునేంత వరకూ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మొత్తానికి ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సర్కారులో భాగస్వాములైన మంత్రుల అవినీతిపై చర్యల కోసం సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఈ నేపథ్యంలో.. తమపై, తమ కుటుంబసభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలని రెవిన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఇటీవలి రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు ఇలాంటి నైతిక విలువలు పాటించడం అరుదుగా చెప్పకతప్పదు. సొంత జిల్లా అయిన శ్రీకాకుళం లోని కన్యధారలో తన కుమారుడి కంపెనీకి అక్రమంగా గనుల లీజు కట్టబెట్టారని ప్రతిపక్షాలు, మీడియా ఆరోపించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపించాలని స్వయంగా ధర్మానే సీఎంకు లేఖ రాయడం ప్రజాస్వామ్యంలో శుభపరిణామమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అంతకుముందు.. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే విధానం అనుసరించారు. తనపై సొంత పార్టీకి చెందిన ఎంపి రాయపాటి సాంబశివరావు అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో కన్నా స్పందించారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. కన్నాపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించిన రాయపాటి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధినేత్రికి ఆయన అవినీతికి సంబంధించిన వివరాలను అందచేసిన విషయం తెలిసింది. ఇప్పటికీ మంత్రివర్గంలోని అవినీతిపరులను త్వరలో తొలగించనున్నారని కన్నాను దృష్టిలో ఉంచుకుని రాయపాటి ప్రకటనలిస్తూనే ఉన్నారు.
తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని స్వయంగా ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాసిన నేపథ్యంలో.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులు కూడా ధర్మానను అనుసరిస్తారా అన్న ప్రశ్నలు తెరపైకి వ స్తున్నాయి. ఒకవేళ వారు ఆ విధంగా కాకుండా, మౌనంగా ఉండిపోతే తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిజమని అంగీకరించవలసి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు.

ప్రస్తుత మంత్రివర్గంలో విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలారోజుల నుంచి అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం మండలం గాజులరేగ గ్రామంలో 3.36 ఎకరాల చెరువును ఆయన కుటుంబసభ్యులు ఆక్రమించారని, అదే పంచాయతీ లోని సర్వే నెంబరరు 35లో 1,2,3,5,6 లోని 11 ఎకరాల భూమిని బొత్స గురునాయుడు ఎడ్యుకేషన్ ట్రస్టు పేర, ఇనాందారు పేర భూమిని కొన్నారన్న ఆరోపణలు చేసింది. ఆ స్థలంలో నిర్మించిన సత్యా ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా ఉన్న 3 కోట్ల విలువైన 3.36 ఎకరాల పొన్నకారి చెరువును కాలేజీ గ్రౌండ్ల కోసం చదును చేశారని టిడిపి ఆరోపించింది.
విజయనగరంలోని తోటపాలెంలో 4 కోట్ల విలువైన డీసీఎంఎస్ స్థలాన్ని కాలేజీ కోసం రాత్రికి రాత్రి కుటుంబసభ్యుల చేత టెండర్లు వేయించి, పోటీకి ఎవరూ రాకుండా చేయడంతో 4 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం కోటి రూపాయలకే దక్కించుకున్న వైనంపై ప్రతిపక్షాలన్నీ ధర్నా చేయగా, సర్కారు దిగివచ్చి ఆ టెండర్లను రద్దు చేసిన వైనం తెలిసిందే. 2009లో ఆయన సోదరుడు లక్ష్మణరావు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న 3 కోట్ల విలువైన 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, కాళీమాత ఆలయానికి చెందిన 3 ఎకరాల 92 సెంట్లను ఆక్రమించారని, ప్రభుత్వ స్థలం 33 సంవత్సరాలకు ఏటా కేవలం 1100 అద్దెతో లీజు దక్కించుకున్నారని టీడీపీ ఆరోపణలు చేసి, దానిని మీడియాకు వెల్లడించింది.
మంత్రి రఘువీరారెడ్డి కూడా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మేఘమథనం పేరుతో 130 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. అగ్ని ఏవియేషన్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడంలో నిబంధనలు ఉల్లంఘించారని, 5 జిల్లాలు వరదల్లో మునిగిపోతే వాటిని సైతం మేఘమథనంలో చూపారన్న ఆరోపణలపై టిడిపి ధ్వజమెత్తింది. మోటార్సైకిల్పై 9 టన్నుల బరువైన 360 బస్తాల వేరుశెనగ విత్తనాలు రవాణా చేసినట్లు చెప్పడం మంత్రికే చెల్లిందంటున్నారు.
మంత్రి వట్టి వసంతకుమార్ తాళ్లరేవు మండలం, చొల్లంగిలో 57 ఎకరాల 39 సెంట్ల భూమిని స్వాహా చేసి, 18 (2)భూసంస్కరణ చట్టానికి రాయితీ తెప్పించుకున్నారని, రాయితీ ఇచ్చిన మూడు రోజులకే ప్రభుత్వ ఉత్తర్వులు తెచ్చారని టీడీపీ ఆరోపించింది. చేపల చెరువుకు జడ్పీ ఉపాథి హామీ పథకం నిధుల నుంచి 37 లక్షలు వెచ్చించి రోడ్లు వేయించారని, పని మంజూరులో ఎండిఓ, డిఎఫ్ఓలు విరుద్ధ ప్రకటనలిచ్చారు.


మిగిలిన లక్ష టన్నుల బియ్యం కోటాను తమకు ఇవ్వాలని ఏపీ రైస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కోరగా, దానికి మాత్రం 50 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అనుమతించింది.పైగా ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కంటే క్వింటాలుకు వందరూపాయల తక్కువ ధరకే ఉప్పుడు బియ్యం సరఫరా చేస్తామని ఏపీ రైస్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చినా మంత్రి పట్టించుకోకపోవడం వెనుక కోట్లాది రూపాయల అవినీతి ఉందని.. ఇందులో సీఎం, మంత్రి, కమిషనర్కు ముడుపులు ముట్టాయని అన్ని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఉప్పుడు బియ్యం ఎగుమతుల్లో దాదాపు 26 కోట్లు గోల్మాల్ జరిగిందని, ఒక్కో క్వింటాలుకు 130 రూపాయల చొప్పున ముడుపులు ఇవ్వాలని మంత్రి, కమిషనర్ తరఫున దళారులు డబ్బు వసూలు చేశారని, తమిళనాడుకు ఉప్పుడు బియ్యం ఎగుమతిలో టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.

తూర్పు గోదావరి జిల్లాలో కోట్ల రూపాయల విలువచే సే క్రైస్తవ సేవా సంస్థల ఆస్తులను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులు కబ్జా చేయడంతో పాటు లేవుట్లు చేసి అమ్ముకునే ప్రయత్నాలపై దుమారం రేగింది. భూకబ్జా దారులకు అనుకూలంగా మునిసిపల్, అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీకి, మునిసిపల్ శాఖా మంత్రికి మంత్రి లేఖ రాయడంతో పాటు, వాటిని కన్వర్షన్ చేయమని సూచించడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.వీటిపై సభాసంఘం సిఫార్సులకు సైతం తిలోదకాలిచ్చారని ఆరోపించాయి.

మంత్రి గల్లా అరుణకు చెందిన అమర్రాజా బ్యాటరీస్కు విద్యుత్ సరఫరాపై అక్రమ పద్ధతుల్లో నిబంధనలను కాదని విద్యుత్ సరఫరా పొందుతోందని, దానివల్ల సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ 2005 జూన్ నుంచి 2007 నవంబర్ వరకూ 2 కోట్ల 97 లక్షల ఆదాయం కోల్పోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీటిని ఇంతవరకూ మంత్రి కంపెనీ నుంచి వసూలు చేయలేదని విరుచుకుపడ్డాయి.

గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విశాఖ పరవాడ ఫార్మాసిటీలో తన కుమారుడు నాగరాజు డైరక్టర్గా ఉన్న కంపెనీకి 5 ఎకరాలు అక్రమంగా కేటాయించారని, ఢిల్లీలో 2 అపార్టుమెంట్లు, పరవాడ, తుర్కపాలెం వద్ద 4 ఎకరాల స్థలం కొన్నారని స్వయంగా కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి కన్నా ఇచ్చిన అఫిడవిట్ను ఆయన సోనియాకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇంతమంది మంత్రులపై ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించేంత సాహసం చేస్తారా? అసలు వీరంతా ధర్మాన, కన్నా మాదిరిగా తమపై విచారించాలని కోరేంత స్ధాయిలో నైతిక విలువలున్నాయా అన్నది మరో సందేహం.