Wednesday, October 27, 2010

రాజకీయ కారణాలే ..... ఆహార భద్రత సంకల్పం * పేదలకు దగ్గరయేందుకు ఆహారభద్రత హక్కు చట్టం

ఆహార తంత్రం
4c-cartoon
దేశంలో త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా? యూపీఏ సర్కారు తాజాగా ప్రకటించిన దేశంలోని 80 కోట్ల మందికి ఆహారభద్రత హక్కు నేపథ్యం అదేనా? యువరాజు రాహుల్‌గాంధీని ప్రధాని పీఠంపై ప్రతిష్ఠించే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త చట్టానికి తెరలేపారా? ముసలితరాన్ని పక్కకుపెట్టి యువతరాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు కొత్త రక్తం ఎక్కించే పనిలో ఉన్నారా? ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాం గ్రెస్‌ అధినేత్రి విసిగి పోయారా? ఆయన సర్కారు పేదలకు వ్యతిరేకంగా, ధనికులకు దగ్గరవుతోందన్న భయాందోళనతో అధినేత్రి ఉన్నారా? అందుకే పేదలకు దగ్గరయేందుకు ఆహారభద్రత హక్కు చట్టం తీసుకు వచ్చారా? అది రానున్న మధ్యంతర ఎన్నికల్లో రాహుల్‌ చేతికి బ్రహ్మా స్త్రంగా కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోందా?.. ఇటీవలి కాలంలో జరుగు తున్న రాజకీయ పరిణామాలు. యూపీఏ సర్కారు పనితీరుపై సర్వత్రా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యం, కాంగ్రెస్‌ నాయకత్వం ఆత్మపరిశీలన తీరు గమనిస్తే ఇలాంటి అనుమా నాలు తెరపైకి రాక తప్పవు.

హఠాత్తుగా తెరపైకి...
దేశంలో 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పం, దరిమిలా తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించని రీతిలో హఠాత్తుగా జరిగిపోయాయి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోనే దీనికి ప్రతిపాదన లు ఉన్నా, ఇంతకాలం గుర్తుకు రాని ఈ అస్త్రం కాంగ్రెస్‌ మదిలోకి హఠా త్తుగా వచ్చింది. ప్రస్తుతం బీహార్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, అక్కడ పాగా వేయటానికి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తును ముందుగానేఊహించి తీసుకున్న నిర్ణయం అని పార్టీ వర్గాలు అంతర్గతంగా అంగీకరిస్తున్నాయి. రాహుల్‌ గాంధీని భవిష్యత్తు ప్రధానిగా చూడాలని ఉందంటూ పార్టీలోని ప్రముఖ నేతలు పలువురు ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రకటించారు. అవకాశం వచ్చినప్పుడల్లా వారు రాహుల్‌ నామ స్మరణ చేస్తున్నారు.

జనంలో రాహుల్‌ మమేకం అవుతున్న తీరు, ఇటీవల ఆదివాసీలు, గిరిజనులు, బడుగు, బలహీన వర్గాల వారు ఎక్కు వగా ఉండే ప్రాంతాలలో రాహుల్‌ పర్యటన, ఆయనను వారు ఆదరించిన తీరు లాంటి అంశాలను మరో ఐదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో కొనసాగేందుకు బ్రహ్మాస్త్రాలుగా కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. రాహుల్‌ సైతం పలు సందర్భాలలో ఈ సామాజిక వర్గాల వారి అభ్యున్నతిపై ఎక్కువగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తు న్నదంతా వారే అని ప్రశంసించారు. ఈ నేపథ్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేసి, వామపక్షాలు, ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకపోయినా, ఒంటరిగానైనా రంగంలోకి దిగి మరో ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఆలోచన కాంగ్రెస్‌ అధినాయకత్వం మదిలో మెదలుతున్నట్టు కనిపిస్తున్నది.

మన్మోహన్‌ బ్యురోక్రసీతో సతమతం?

ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పట్ల ఏఐసీసీ అధినేత్రి సోనియాకు కానీ, ఇతర పార్టీ నాయకులకు కానీ చెప్పుకోదగినంత వ్యతిరేక భావన లేకపోయినా, ఆయన అనుసరిస్తున్న వ్యవహార శైలి, పాలనా పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా పార్టీకి చేటు చేస్తాయన్న ఆలోచనతో అధినాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. స్వతహాగా ఆర్థిక వేత్త, బ్యురోక్రాట్‌ మాత్రమే అయిన మన్మోహన్‌, వరుసగా రెండవ సారి ప్రధాని కావటానికి సోనియా ఆశీస్సులే కారణం.

అయితే ఆయన ఎంత సేపూ ఆర్థిక వేత్తగానే తప్ప పార్టీని రాజకీయంగా బలోపేతం చేయగలిగిన నేతగా కనిపించటం లేదన్న అసంతృప్తి సోనియా తదితరుల్లో కనిపిస్తు న్నది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సమాజంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఉపకరిస్తున్నాయని, పార్టీని అనాదిగా అంటి పెట్టుకున్న బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం కేంద్రం నిర్ణయాలతో ఇబ్బందులు పడటం మరింత పెరిగితే పార్టీ రాజకీయంగా పతనం కాక తప్పదన్న ఆందోళన సోనియాలో కలుగుతున్నట్టు సమాచారం.

ఎడా పెడా పెరుగుతున్న పెట్రో, దాని సంబంధిత ఉత్పత్తుల ధరలు, ఆకాశంలోకి దూసుకుపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వాటిని నియంత్రించలేని అసమర్థ పరిస్థితి, ఈ లోపాలను ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, ఇతర పార్టీలు విమర్శలకు ఉపయోగించుకుంటున్న తీరు కాంగ్రెస్‌లో కంగారుకు కారణమైంది.ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా ఆహార భద్రత హక్కును తెరపైకి తీసుకు వచ్చి పేదల పట్ల తమకే శ్రద్ధ ఉందన్న భావన కలిగించే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతి తక్కువ వ్యవధిలోనే మన్మోహన్‌ను గౌరవ ప్రదంగా పక్కకు తప్పించాలని, అది జరగాలంటే మధ్యంతర ఎన్నికలే మార్గం అన్న ఆలోచనతో సోనియా ఉన్నట్టు కనిపిస్తున్నది.

రాహుల్‌కు మేలు చేసేందుకే...
రాహుల్‌ గాంధీని భావి ప్రధానిగా పార్టీలో అందరూ అంగీకరిస్తున్న తరుణంలో, సాధ్యమైనంత త్వరగా తన కుమారుడిని ఆ స్థానంలో చూసు కోవాలన్న ఆపేక్ష సోనియాకు ఉండటం అత్యంత సహజం. అందుకే బీహార్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో రాహుల్‌కు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం కల్పించారు. రాహుల్‌ సైతం బీజేపీ, ఇతర విపక్షాలను దుమ్మెత్తి పోస్తూ తనలో పరిణతి కలిగిన రాజకీయ వేత్త లక్షణాలు క్రమంగా పుంజుకుంటున్నాయన్న భావన కలిగించారు. పూర్తిగా మన్మోహన్‌ నాయ కత్వంలోనే ఐదేళ్ళూ ప్రభుత్వం కొనసాగితే 2014లో జరిగే ఎన్నికల సమ యానికి బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయని, మరి కొన్ని పార్టీలు సైతం కాంగ్రెస్‌ వైఫల్యాలనే ఎన్నికల ఆయుధాలుగా ఉపయోగించుకునే సూచనలు ఉండటంతో, ఆ అవకాశాన్ని విపక్షాలకు దక్కరాదన్న ఉద్దేశంతోనే మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమమయ్యే ఆలోచనతో కాంగ్రెస్‌ నాయకత్వం ఉన్నట్టు సమాచారం.

ముదుర్లను వదిలించుకునే యత్నం?
అదీగాక యూపీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉంటూ, ప్రభుత్వంలో కొనసాగుతూనే అనేక సందర్భాల్లో పార్టీని ఇరకాటంలో పడవేస్తున్న ఇతర పక్షాలను వదిలించుకోవాలన్నా మధ్యంతర ఎన్నికలే మార్గం అన్నది సోనియా ఆలోచనగా చెబుతున్నారు. ప్రధానంగా రైల్వే మంత్రి మమతా బెనర్జీ లాంటి వారు అనేక సందర్భాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే వ్యతిరేకిస్తూ పంటి కింద రాయిలా తయారయ్యారు. అలాంటి వారిని భాగస్వామ్య పక్షాలుగా తిరస్కరిస్తే ప్రభుత్వ మనుగడ ఇక్కట్లలో పడుతుంది.

అలా అని కొనసాగించలేని స్థితి. ఈ ఇరకాటం నుంచి బయట పడాలన్నా మధ్యంతర ఎన్నికలే మంచి మార్గం అనే ఆలోచన సోనియాకు కలిగినట్టు చెబుతున్నారు. బీహార్‌లో ఆశావహమైన ఫలితాలు వచ్చినా, ఇటు కర్నాటకలో పరిస్థితి తారుమారై బీజేపీ అధికారం నుంచి తొలగి పోవలసి వస్తే, అక్కడ సైతం మధ్యంతర ఎన్నికల అనివార్య స్థితి ఎదురైతే రాహుల్‌ గాంధీని భావి ప్రధానిగా చూపిస్తేనే ఓట్లు రాలుతాయన్న ఆలో చన, వ్యూహంతో కాంగ్రెస్‌ నాయకత్వంకనిపిస్తున్నది.

ముందస్తు ప్రణాళిక...
దేశంలో అత్యధిక శాతం మందికి ఆహార భద్రత కల్పిస్తూ ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రతిపాదనలు చేసినా, ఇంతకాలం పట్టించుకోకుండా హఠా త్తుగా దానిపై నిర్ణయం తీసుకోవటం వెనుక రాజకీయ కారణాలే తప్ప మరేవీ లేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా ప్రస్తు తం ఉన్న బలాన్ని మరింత పెంచుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదన్న ఆలోచనతో కాంగ్రెస్‌ నాయకత్వం కనిపిస్తున్నది.రాహుల్‌ ని భావి ప్రధానిగా చూసుకోవాలన్న సోనియా కల సాకారం కావాలన్నా, మరోసారి ఐదేళ్ళ పాటు కేంద్రంలో అధికారం చెలాయించాలన్నా పేదలు, బడుగు, బలహీన వర్గాల ఆశీర్వాదం లేకపోతే సాధ్యం కాదన్న నిర్ణయానికి కాంగ్రెస్‌ నాయకత్వం వచ్చిందని చెబుతున్నారు. ఈ రెండు బలమైన కారణాలే ఆహార భద్రత హక్కును హఠాత్తుగా ముందుకు తీసుకురావటానికి ప్రాతిపదికలు అని కాంగ్రెస్‌లో మెజారిటీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

జగన్‌.. సొంత పార్టీ వైపే అడుగులు

సొంత పార్టీనే దిక్కు
Jaganmohan_Reddy
తండ్రి మృతి చెందిన మరుక్షణం నుంచీ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి, ఆ లక్ష్యసాధన కోసం కంటిమీద కును కు లేకుండా పనిచేస్తూ, ముఖ్యమంత్రి రోశయ్య పీఠానికి ఎసరు పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖరరెడ్డి తనయడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఇక సొంత పార్టీనే దిక్కయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సైతం ఆ దిశగానే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు జగన్‌ శిబిరం సమాచారం. వైఎస్‌ మృతి చెందిన తర్వాత జగన్‌కు ఎంత తీవ్రమైన మద్దతు వ్యక్తమ యిందో, ఇప్పుడు అదే మద్దతు అంత పేలవంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సంతకాలు చేసిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు అరడజను మంది తప్ప, మిగిలిన వారంతా భూతద్దం వేసి వెతికినా కనిపించకపోవడంతో జగన్‌ శిబిరంలో నిరాశా, నిస్పృహలు ఆవ హించాయి. సొంత పత్రికలో సొంత వర్గీయుల ప్రకటనలు తప్ప, మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా జగన్‌కు సంబంధించిన గళమే వినిపించడం లేదు. అది కూడా ఆ అరడజను మందే కనిపిస్తు న్నారు. చివరకు హంగూ ఆర్భాటాలతోమొదలుపెట్టిన ఓదార్పు యాత్ర సైతం అత్యంత పేలవంగా సాగు తోంది. మీడియా సైతం దానికి మునుపటి మాదిరిగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, చర్చల్లో కూడా ఎక్కడా ఓదార్పు ముచ్చట్లు విని పించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఓదార్పు యాత్రకు భారీగా ఖర్చు పెట్టుకుని, రోజులు వెళ్లదీస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రస్తుతం జగన్‌కు అరడజను మంది ఎమ్మెల్యేలు తప్ప మిగి లిన వారి మద్దతు లేదని సొంత వర్గం నేతలే అంతర్గతంగా అంగీ కరిస్తున్నారు. ఇక ఎంపీల్లో సబ్బం హరి, మేకపాటి మినహా మరెవరూ మద్దతునివ్వడం లేదు. తండ్రి ఆత్మబంధువయిన కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ మొండివైఖరికి విసిగి వేసారి పోయి ఆయనను విడిచిపెట్టి, సొంత రాజకీయ ఎదుగుదల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం.. జగన్‌తో ఉంటే పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని తెలియడంతో వారు కూడా మొఖం చాటేసుకుంటున్నారు.

ఇక తాజాగా యువజన కాంగ్రెస్‌ నాయకులను కూడా పార్టీ నాయకత్వం నియంత్రించడం ప్రారంభించడంతో జగన్‌ ఉక్కిరి బిక్కిరయి ఒంటరిగా మారిపోయారు. ఇంతవరకూ ఎమ్మెల్యేలు తన ఓదార్పు యాత్రకు రాకపోతే.. వారి తర్వాత శ్రేణులు, ప్రధానంగా బలమైన యూత్‌ కాంగ్రెస్‌ నేతలపై వల విసరడం ద్వారా, ఎమ్మెల్యేలను బలవంతంగా దారికి తెచ్చుకోవడంలో విజయవంతమైన జగన్‌ వ్యూహం.. తాజాగా బెడిసికొట్టడంతో ఖంగుతినవలసి వచ్చింది. జగన్‌ మద్దతుదారులయిన యూత్‌ కాంగ్రెస్‌ నేతల పదవులన్నింటినీ రద్దు చేయడంతో, జగన్‌కు ఇప్పటివరకూ ఉన్న ఆ కాస్త మద్దతు కూడా మాయమయింది.

ప్రస్తుతం యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు తమ పదవుల కోసం తప్ప, జగన్‌ కోసం పనిచేసేందుకు సమయం కేటాయించే పరిస్థితి లేదు. జగన్‌కు ఇప్పటిదాకా దన్నుగా నిలిచిన యూత్‌ కాంగ్రెస్‌ ప్రముఖులకు నాయకత్వం చెక్‌ పెట్టడంతో ఇప్పుడు వారే బలహీనులయ్యారు. ప్రస్తుతానికి కొందరు మంత్రులు మాత్రమే జగన్‌తో తెరచాటు మంతనాలు సాగిస్తున్నారు. వారి శాఖల అంశాలపైనే జగన్‌కు సంబంధించిన మీడియా సంస్థల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా కథనాలు వెలువడుతున్న విష యం చర్చనీయాంశమయింది. గత కొద్దిరోజులుగా అభయ హస్తం, పావలా వడ్డీకి సంబంధించిన వార్తలు వెలువడుతున్న విషయాన్ని తమ అనుమానాలకు మద్దతుగా ప్రస్తావిస్తున్నారు. వైఎస్‌ జీవించి ఉన్నప్పుడు సైతం పావలా వడ్డీ, అభయహస్తం పథకాలకు బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు స్వల్పమేనని గుర్తు చేస్తున్నారు.

అప్పుడు ఆ పథకాలపై రాని వార్తలు, ఇప్పుడు రోశయ్య సీఎం అయిన తర్వాతే వస్తున్నాయంటే వాటి వెనుక ఏ మంత్రుల హస్తం ఉందో స్పష్టం అవుతోందని కొందరు ఎమ్మె ల్యేలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి మంత్రుల వైఖరిపై ముఖ్యమంత్రి గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేసినా వారి పనితీరు, జగన్‌కు విధేయతలో మార్పు రాలేదంటున్నారు. పైగా రోశయ్య ప్రభు త్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలుచేసేందుకే మంత్రుల హోదాలో మహిళలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ, వ్యూహాత్మకంగా రోశ య్యను భ్రష్ఠుపట్టిస్తున్నారంటున్నారు. ఇక పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని వంటి మంత్రులు జగన్‌కు బాహాటంగానే తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

అటు.. అధిష్ఠానం కూడా రోశయ్యను మార్చే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేకపోవడంతో జగన్‌ ముఖ్యమంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయిపోయాయి. పైగా పార్టీ అధినేత్రి.. రోశయ్యపై సానుభూతి చూపించడం, వైఎస్‌ మాదిరిగా కాకుండా ప్రతి అంశాన్నీ తనకు చెప్పి చేయటంతో రోశయ్యనే పూర్తి కాలం కొనసాగించే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు.. ఎమ్మె ల్యేలు, మెజారిటీ మంత్రులు, ఎంపీలు ముఖం చాటేస్తుండటం కూడా జగన్‌ లో ఆందోళన పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో జగన్‌కు సొంత పార్టీ పెట్టడం తప్ప మరో దిక్కు కనిపించడం లేదు. ఇప్పటివరకూ అటు రోశయ్యను, ఇటు చంద్రబాబును, అదే సమయంలో పార్టీలోని వైఎస్‌ ప్రత్యర్థులను ఏకకాలంలో ఎదుర్కుంటున్న జగన్‌ ఆ లక్ష్యంలో పూర్తిగా అలసి పో యారు. ఈ ఒంటరి పోరాటం ఇకపై కష్టమని ఆయన గ్రహిం చినట్లు కనిపిస్తోంది. తన ఓదార్పు యాత్రను పార్టీ నాయకత్వం లెక్కచేయడం లేదంటే, తన ప్రాధాన్యాన్ని అధిష్ఠానం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న వాస్తవాన్ని సైతం ఆయన గ్రహించక పోలేదంటున్నారు.

ఇప్పుడు కూడా సొంత పార్టీ పెట్టకుండా, ఎక్కు వ కాలం అధిష్ఠానాన్ని బెదిరించడానికే పరిమితమయితే అది సాధ్యం కాదని ఆయన అనుచరులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నందున పార్టీ పెట్టవచ్చంటున్నా రు. లేకపోతే ఇప్పటివరకూ ఉన్న అభిమానులు, నాయకులు కూడా మిగలరంటున్నారు. సొంత పార్టీ పెడితేనే తన సత్తా చూపించవచ్చని, పార్టీలోనే ఉంటే తనను గుర్తించడం కష్టమన్న వాస్తవాలను ‘అనేక సంఘటనల ద్వారా అనుభవించిన’ జగన్‌.. సొంత పార్టీ వైపే అడుగులు వేస్తున్నారంటున్నారు.

Friday, October 1, 2010

పవర్ గేమ్ .... మన్మోహన్ తీరుపై సోనియా అసంతృప్తి

ప్రధాని చర్యలతో రాహుల్ భవితవ్యానికి ఇబ్బందులేనని భావిస్తున్న మేడం
గవర్నర్‌ల నియామకంలోనూ ఇద్దరి మధ్య విభేదాలు
విధాన నిర్ణయాల్లో యువరాజు ప్రభావం
మాట వినని మంత్రులు.. అసంతృప్తితో ప్రధాని
కేంద్ర కేబినెట్ విస్తరణ సోనియా కనుసన్నల్లోనే
అంగీకరించకుంటే మన్మోహన్‌కూ ఉద్వాసన?
ప్రత్యామ్నాయ రేసులో ఆంటోని, ప్రణబ్!

దెబ్బతింటున్న ఆమ్ ఆద్మీ నినాదం
ప్రధానిది కార్పొరేట్ విధానం
జాతీయ ఆహార భద్రత బిల్లు ఊసేది?
ఇవీ మేడం అభ్యంతరాలు

ఆహార భారం కష్టమంటున్న మన్మోహన్
తనది సుస్థిర సర్కారంటూ ప్రకటనలు
రిటైర్ అయ్యేది లేదంటూ వ్యాఖ్యలు
ప్రభుత్వంలో పార్టీ జోక్యంపై కినుక

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కూ మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయా? పార్టీ విధానాలకు, ప్రభుత్వానికీ మధ్య సమన్వయం ఏర్పరచగల నేతగా మన్మోహన్ ఉపయోగపడడం లేదని సోనియా భావిస్తున్నారా? ఈ విభేదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందా? వచ్చే ఎన్నికల లోపే ప్రత్యామ్నాయ నేతను సోనియా ఎంపిక చేసుకోవాల్సి వస్తుందా? గత కొంత కాలంగా హస్తినలో కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఇది!

ప్రత్యామ్నాయ నేతలుగా ఏకే ఆంటోనీ, ప్రణబ్‌ముఖర్జీల పేర్లపైనా తర్జనభర్జనలు సాగుతున్నాయి. గత నెల పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ కార్యక్రమం, కాశ్మీర్, అయో« ద్య అంశాలు, బీహార్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక.. మొదలైన అనేక అంశాలపై పార్టీ కీలక సమావేశాల్లో ప్రధాని చురుకుగా వ్యవహరించారు.

అయినా.. ప్రభుత్వ నిర్వహణ, పార్టీ వ్యవహారాల్లో అనేక అంశాలపై పార్టీ అధినేత్రికి, ప్రభుత్వాధినేతకు మధ్య పొసగడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ నిర్వహణలో పార్టీ జోక్యాన్ని మన్మోహన్ వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో పార్టీ సూచించిన అంశాలను మన్మోహన్ పెడచెవిన పెడుతున్నారంటూ సోనియా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనే క మంది మంత్రులు సోనియాగాంధీ సూచనలకు అనుగుణంగా పని చేస్తూ, తనను పెద్దగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి మన్మోహన్‌లో ఉందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

యూపీఏ మలివిడత ప్రభుత్వంలోనే ఈ ధోరణి మరింత ఉందని తెలుస్తోంది. పార్టీ మేధావి, ఆపత్కాలంలో ఆదుకుంటాడని పేరున్న ప్రణబ్‌ముఖర్జీ గత ప్రభుత్వంలో మన్మోహన్‌కు పూర్తి తోడ్పాటు అందించారు. కానీ.. ఈ విడత పలు విషయాల్లో అంటీముట్టనట్లు కనిపిస్తున్నారన్న వాదన ఉంది. ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడినప్పుడు, అది కూడా పార్టీ అధ్యక్షురాలు కోరినప్పుడే ప్రణబ్ రంగప్రవేశం చేసి.. ఒడ్డునపడేస్తున్నారు.

ఇటీవల కాశ్మీర్ తీవ్రంగా రగిలినప్పుడు కానీ, కామన్ వెల్త్ క్రీడల భవిష్యత్తు సంక్షోభంలో పడ్డప్పుడు ప్రణబ్ జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. కామన్‌వెల్త్ క్రీడలకు ముందు తలెత్తిన సంక్షోభ సమయంలో ప్రణబ్‌తో ప్రమేయం లేకుండా మంత్రుల బృందాన్ని ఏర్పరిచారు. ఈ బృందం బాధ్యతలు సరిగా నిర్వహించకపోవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తపరిచినట్లు వార్తలు వచ్చాయి.

ఒక దశలో సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ స్వయంగా క్రీడల నిర్వహణను సమీక్షించి ప్రధానికి తగిన సూచనలు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. కాశ్మీర్, కామన్‌వెల్త్ క్రీడలపై కాంగ్రెస్ జోక్యం చేసుకున్నాకే పరిస్థితులు చక్కబడ్డాయని పార్టీ వర్గాలంటున్నాయి.

అయోధ్య తీర్పు విషయంలో పార్టీ ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం, భద్రతా వ్యవహారాలను చక్కదిద్దాలని హోంమంత్రిని కోరడం జరిగిందని, లేకపోతే కామన్ వెల్త్ క్రీడల సమయంలో తీవ్ర సంక్షోభం తలెత్తేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వపరమైన సమస్యల పరిష్కారానికి పార్టీ రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ పార్టీ ప్రతిష్ఠను మెరుగుపరిచేందుకు ప్రధాని చర్యలు తీసుకోలేదన్న అభిప్రాయం కొందరు కాంగ్రెస్ నేతల్లో ఉంది.

ఆమ్ ఆద్మీ ముద్ర ఏదీ?
నిజానికి మన్మోహన్ రెండవ విడత ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆమ్ ఆద్మీ నినాదానికి గండి పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ సలహా మండలి చైర్మన్‌గా సోనియా ప్రతిపాదించిన జాతీయ ఆహార భద్రతపై ప్రభుత్వం ఇంత వరకూ నిర్ణయానికి రాలేదు. ఈ కార్యక్రమం అమలు చేయాలంటే కేంద్రానికి అదనంగా 34వేల కోట్లు అవసరం. వీటితో పాటు.. ఆరు కోట్ల టన్నులకుపైగా ఆహార ధాన్యాలను సేకరించాల్సి ఉంటుంది.

ఇంత భారాన్ని మోయడం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఆహార ధాన్యాలు గోదాముల్లో కుళ్లిపోయే బదులు పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న సుప్రీం సూచనల్నీ ప్రధాన మంత్రి ఇటీవల పత్రికా సంపాదకుల సమావేశంలో కొట్టిపారేశారు. ఒకవైపు సోనియా ఆహార భద్రత గురించి మాట్లాడుతుంటే ప్రధాని సుప్రీం ఆదేశాలనే విమర్శించడం పార్టీలో చర్చనీయాంశం అయింది.

అంతేకాక తనది నెహ్రూ, ఇందిర ప్రభుత్వాల కన్నా స్థిరమైన ప్రభుత్వమని ప్రధాని సమర్థించుకోవడం, తాను రిటైరయ్యే అవకాశం లేదని స్పష్టం చేయడంపై కూడా పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. పార్టీలో భావినాయకుడుగా భావిస్తున్న రాహుల్ గాంధీ కూడా కొన్ని నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న వాదన ఉంది. ఒరిస్సాలో నియామ్‌గిరి పర్వత శ్రేణుల్ని రాహుల్ సందర్శించిన తర్వాత వేదాంతకు ఇచ్చిన పర్యావరణ లైసెన్సును రద్దు చేయడం ప్రధానమంత్రి ప్రమేయం లేకుండా జరిగిందని చెబుతున్నారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా అనేక మైనింగ్ ప్రాజెక్టులకు అనుమతులను నిలిపివేశారు. అనేక బొగ్గు బ్లాకుల కేటాయింపులో కూడా పర్యావరణ మంత్రి జైరాం రమేశ్ మోకాలడ్డడంతో పీఎంవో స్వయంగా జోక్యం చేసుకోవల్సి వచ్చింది. సమాచార హక్కు చట్టానికి కేంద్రం తలపెట్టిన సవరణలను కూడా సోనియా స్వయంగా ప్రధానికి లేఖలు రాసి అడ్డుకున్నారు. అంతే కాక దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఉదారంగా సహాయం అందించాలని ప్రధానిని సోనియా కోరుతున్నారు.

ఇలా ప్రభుత్వ నిర్ణయాల్లో పార్టీ కలుగ చేసుకోవడంపై ప్రధాని, ఆయన సలహాదారుల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ను యథాతథ పరిస్థితిని కోరే పార్టీగా, మార్పును అడ్డుకునే పార్టీగా ఆయన మీడియా సలహాదారు హరీశ్ ఖరే సైతం విమర్శించడం గమనార్హం. ఖరే వ్యాఖ్యలు కూడా పీఎంవోకూ, టెన్ జనపథ్‌కూ మధ్య విభేదాలను స్పష్టంగా సూచిస్తున్నాయి. కాగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, గవర్నర్ల నియమకంలోనూ ఈ రెండు అధికార కేంద్రాల మ«ధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల ఎన్నికల కమిషనర్‌గా పదవీ విరమణ చేసిన నవీన్ చావ్లా, గతంలో తన సలహాదారుగా ఉన్న పులోక్ చటర్జీలను గవర్నర్లుగా నియమించాలని సోనియా భావిస్తున్నట్లు తెలిసింది. మరో వైపు ప్రధాని కార్యాలయంలో ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉన్న టీకేఏ నాయర్, ప్రణాళికా సంఘం సభ్యుడు చతుర్వేదిలను గవర్నర్లుగా నియమించాలని ప్రధాని భావిస్తున్నారు. కాగా పార్టీ ప్రతిష్ఠ పెంచేందుకు, రాహుల్ గాంధీని ఆమ్ ఆద్మీ నేతగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న అనేక ప్రయత్నాలు మన్మోహన్ సింగ్ సర్కార్ కార్పొరేట్ అనుకూల వైఖరి వల్ల దెబ్బతింటున్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వైఖరిని సరిదిద్దడమా, లేక ప్రత్యామ్నాయ నేతను ఎంపిక చేసుకోవడమా? అన్న చర్చ కామన్‌వెల్త్ క్రీడల తర్వాత తీవ్రతరమవుతుందని భావిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఈ సారి పూర్తిగా సోనియా స్వయంగా చేపడతారని, పలువురు మంత్రులకు ఉద్వాసన జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీటిని ప్రధాని అంగీకరించకపోతే ఆయన మార్పు కూడా జరగక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.