Friday, December 16, 2011

రాజకీయ యుద్ధం ... జోడెద్దుల డీ


రాష్ట్ర కాంగ్రెస్‌ రాజకీయ చిత్రపటం ఒక్కసారిగా మారిపోతున్నది. రాజకీయ సమీకరణాల్లో మార్పులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ దాకా అసంతృప్తి పవనాలు వీస్తున్నాయి. ఆ పవనాలన్నీ కిరణ్‌ కుమార్‌ మీదగానే పోతుండటం ఇక్కడ విశేషం. ఆయన మీద బలమైన శక్తులే కత్తులు ఝళిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి చాప కింద నీరులా తన మానాన తాను పని చేసుకుంటూపోతున్నారని అందరూ భావిస్తున్న తరుణంలో అదంతా సక్రమమైన భావన కాదని, కేవలం భ్రాంతి మాత్రమేనని ధ్రువపరుస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంత ర్యుద్ధమే జరుగుతోంది. అది నివురు గప్పిన నిప్పులా ఉండి, ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటపడుతున్నది. ఇప్పుడది బహిరంగ యుద్ధంగా మారింది.

ఒక పక్క పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముఖ్య మంత్రి ఒంటెత్తు పోకడలపై ఢిల్లీలో నేరుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేబినెట్‌ని విశ్వాసంలోకి తీసుకోకుండా తనంత తానుగా పథకాలు ప్రకటించేసుకుంటున్నారని ఆయన సోనియాకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. మంత్రులను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, దాంతో మంత్రులు పాలనకు దూరమైనామన్న భావనలో ఉన్నారని ఆయన చెప్పినట్లు తెలిసింది. కేబినెట్‌ని కలుపుకొనిపోలేక పోతున్నారని, అది ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నదని బొత్స మేడమ్‌కి చాలా ఆందోళనకరంగా చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల కథనం.

మరోపక్క మంత్రులు సైతం ఏమాత్రం ముఖ్యమంత్రి పట్ల సంతోషంగాను, సంతృప్తికరంగాను లేరన్న సంగతి రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో బట్టబయలైంది. ఎస్పీల మీటింగులో ముఖ్యమంత్రి తమను బైటికెళ్లిపోతే ఎస్పీలతో కాన్ఫిడెన్షియల్‌గా మాట్లాడుకుంటాననడం పెద్ద వివాదంగా మారింది. ముఖ్యమంత్రి తమను అవమానించారని మంత్రులు లోలోన బాధపడుతున్నారు. తమ సీనియారిటీ సైతం చూడకుండా ముఖ్యమంత్రి అలా అనుచితంగా వ్యవహరించడం బాధాకరమని కొందరు మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. మొత్తానికి రాష్ట్ర కేబినెట్‌ సమైక్యంగా లేదన్న విషయం కలెక్టర్ల సదస్సుతో బైటపడింది. మంత్రులు ముఖ్యమంత్రి మీదున్న అసంతృప్తిని కలెక్టర్ల మీద వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి నిర్ణయాల్లో కొన్నింటికి కేబినెట్‌ అంగీకారం లేదని, కేబినెట్‌లో చర్చించనే లేదని కొందరు మంత్రులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
kiran--ministers
ఇక చేనేత, జౌళి శాఖ మంత్రి శంకర్రావు సంగతి సరేసరి. మంత్రులంతా వెళ్లినా ఆయన కలెక్టర్ల సదస్సులో అలాగే కూర్చుండిపోవడం..ముఖ్యమంత్రి తన సన్నిహిత అధికారి చేత బైటికెళ్లాలని చెప్పించడం..అదంతా మంత్రి శంకర్రావు వెలుపలికొచ్చి మీడియా ముందు చెప్పడం క్షణాల్లో జరిగిపోయాయి. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి వ్యతిరేకంగా కేబినెట్లో పెద్ద వర్గమే సమీకృతమవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ దీర్ఘకాలిక మనుగడ మీద ప్రభావం చూపుతాయని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అటు బొత్సతోను, ఇటు కేబినెట్‌లోని సీనియర్‌ మంత్రులతోను ఏకకాలంలో యుద్ధం చేస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇతర నాయకులు అంటున్నారు. ఈ యుద్ధం చివరకు ఎక్కడికి దారి తీస్తుందన్నది వేచి చూడాల్సిందేనన్నది వారి అభిప్రాయం. ఈ ప్రమాద ఘంటికల ప్రతిధ్వనులు ఢిల్లీ దాకా వినిపించేందుకు కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

సూర్య ప్రధాన ప్రతినిధి:రాష్ట్ర కాంగ్రెస్‌లో 1983 ముందు నాటి పరిస్థితి పునరావృతం కానుందా? గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రులపై తిరుగుబాటు చేసే సంస్కృతి మళ్లీ మొదలుకానుందా? మునుపటి మాదిరిగానే ముఖ్యమంత్రులపై మంత్రులు యుద్ధం ప్రకటించబోతున్నారా? ముఖ్యమంత్రికి మంత్రులకూ పూడ్చలేనంత అగాథం పెరిగిపోతోందా?.. గత కొద్దిరోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో పాటు రెండురోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రులు విరుచుకుపడిన తీరు పరిశీలిస్తే ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తున్నాయి.

అసలే అంతంత మాత్రంగా ఉన్న ముఖ్యమంత్రి-మంత్రుల సంబంధాలు జిల్లా కలెక్టర్ల భేటీతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. చాలాకాలం నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి-మంత్రుల నడుమ పైకి కనిపించని దూరం ఉంది. కిరణ్‌ నియంతృత్వపోకడలతో వెళుతున్నారని, తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, సోదరులతోనే అన్నీ నడిపిస్తున్నారని, కనీసం తమ ఫైళ్లు కూడా సీఎంఓ నుంచి కదలడం లేదని బాహాటంగానే మండిపడుతున్నారు. సీఎం తమ శాఖల్లో తమకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకోవడం ఎవరికీ రుచించడం లేదు. శంకర్‌రావు శాఖకు సంబంధించిన శాఖ సమీక్షకు ఆయనను పిలవడమే మానేశారు.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్‌ మంత్రులు జానారెడ్డి, డీఎల్‌ రవీంద్రారెడ్డి, శంకర్‌రావు, వట్టి వసంతకుమార్‌, పొన్నాల లక్ష్మయ్య తదితరులకు కిరణ్‌ వ్యవహారశైలి, నిర్లక్ష్య ధోరణి ఏమాత్రం రుచించడం లేదు. వట్టి, పొన్నాల మినహా మిగిలిన వారంతా కిరణ్‌ కంటే సీనియర్లు కావడంతో ఆయన నిర్లక్ష్య ధోరణిని వారంతా అవమానంగా పరిగణిస్తున్నారు. ప్రధానంగా.. వీరంతా కిరణ్‌ తండ్రి అమర్‌నాధ్‌రెడ్డితో కలసి పనిచేసిన వారే. మిగిలిన వారంతా వైఎస్‌ హయాంలో మంత్రులుగా ఇప్పటివరకూ రెండు, మూడుసార్లు పనిచేసిన అనుభవం ఉన్నవారు. కిరణ్‌ మంత్రి కాకుండా నేరుగా సీఎం అయినప్పటికీ, తమపై నిర్లక్ష్యపు ధోరణి ప్రదర్శించడాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఒక జూనియర్‌ కింద తాము పనిచేస్తున్నామన్న భావన వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. ‘మా కంటే కిరణ్‌ జూనియర్‌ అయినా హైకమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆయన సీటును చూసి గౌరవిస్తున్నాం. కానీ ఆయన మాత్రం మాకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. మా సహనానికీ హద్దు ఉంటుంది కదా? వైఎస్‌ అంతటి వాడే మమ్మల్ని గౌరవించారు’ అని ఓ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

కలెక్టర్ల సమావేశం తొలిరోజులో రఘువీరారెడ్డి, సబితా ఇంద్రరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మహీధర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, శ్రీధర్‌బాబు, డికె అరుణ, ముఖేష్‌ మినహా మిగిలిన మంత్రులంతా సమస్యలను అడ్డుపెట్టుకుని సీఎంపై తిరుగుబాటు చేసినంత పనిచేశారు. సమావేశం నుంచి అసంతృప్తి, ఆగ్రహంతో బయటకు వచ్చి మీడియా, తమ సహచరుల వద్ద జనాంతికంగా వారు చేసిన వ్యాఖ్యలు కిరణ్‌పై మంత్రులకు ఉన్న అసంతృప్తి, దూరాన్ని స్పష్టం చేశాయి. ఇద్దరు మంత్రులయితే కిరణ్‌ను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ వెళ్లిపోయారు. ఇందిరజలప్రభ మంత్రివర్గ సమిష్ఠి నిర్ణయం కాదని, దానిపై సమీక్షించవలసిన అవసరం ఉందని జానారెడ్డి తాజాగా వ్యాఖ్యానించడం బట్టి.. కిరణ్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వారి ఆవేదన నిజం చేసినట్టయింది. దీన్ని బట్టి మంత్రులకు- ముఖ్యమంత్రికీ యుద్ధం మొదలు కానుందన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

అయితే, తొలిరోజు సమావేశంలో మంత్రుల అసంతృప్తిని పసిగట్టి, ముఖ్యమంత్రి రెండోరోజుయినా వారిని బుజ్జగిస్తారని చాలామంది అంచనా వేశారు. కానీ, కిరణ్‌ తన మొండి వైఖరి రెండోరోజు కూడా కొనసాగించి, తమను అవమానించారని మంత్రులు మండిపడ్డారు. సీనియర్‌ మంత్రి శ ంకర్‌రావును సీఎంఓ ముఖ్య అధికారితో చెప్పించి మరీ సమావేశం నుంచి వెళ్లగొట్టడంతో మంత్రుల అహం మరింత దెబ్బతిన్నట్టయింది. ఎస్పీలతో సమావేశ సమయంలో మంత్రులెవరినీ ఉండవద్దని ఆదేశించడంతో మంత్రుల ఈగో పూర్తిగా దెబ్బతిన్నట్టయింది. ఎస్పీల సమావేశంలో ఉండాలని గానీ, ఉండకూడదని గానీ నిబంధన ఏమీ లేదని, అయినా అందులో రహస్యాలు ఏమి ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

కిరణ్‌ రాజకీయాలకు రాకముందు నుంచీ చురుకుగా పనిచేయడంతో పాటు, మంత్రులుగా పనిచేసిన తమను కిరణ్‌ ఎస్పీల ఎదుట అవమానించారని కన్నెర్ర చేస్తున్నారు. ఇది తమను అవమానించడమేనని బయటకు వచ్చిన మంత్రులు వ్యాఖ్యానించారు. మంత్రులకు విలువలేదని, అంతా తానేనని కలెక్టర్లు, ఎస్పీలకు సంకేతాలు ఇచ్చేందుకే కిరణ్‌ కావాలని తమను అవమానించారంటున్నారు. పాలనలో పారదర్శకత పేరుచెబుతున్న కిరణ్‌.. మంత్రులనే సమావేశం నుంచి బయటకు పంపించారంటే సీఎం తాను చెబుతున్న విధానాలను తానే ఎంతవరకూ అమలుచేస్తున్నారో అర్ధమవుతోందంటూ రుసరుసలాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎస్పీల సదస్సులో మంత్రులనూ ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

‘మేం మంత్రులం కాదా? లా ఆర్డర్‌లో ఏం జరుగుతోందో మాకు తెలుసుకునే హక్కు లేదా? మేం ప్రభుత్వంలో భాగస్వాములం కాదా? మమ్మల్ని బయటకు పంపించడం కిరణ్‌ అహంకారానికి నిదర్శనం. కార్యకర్తలు, ప్రజల నుంచి మాకొచ్చే ఫిర్యాదులను వారి దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, వారి పనితీరును తెలుసుకుని మేమూ మా అనుభవాలతో సూచనలు చేసే అవకాశం ఉంది. కానీ, కిరణ్‌ మాత్రం మేం అక్కడ ఉంటే తనకు ఇబ్బందిగా భావించి మమ్మల్ని వెళ్లగొట్టారు. సీనియర్‌ మంత్రి శంకర్‌రావు సీఎం నాయనతో కలసి పనిచేశారు. ఢిల్లీలో వాళ్లిద్దరూ ఒకే రూములో ఉండేవారు. అలాంటి వ్యక్తి వయసుకూ కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణం. మేం లేకపోతే కిరణ్‌ ఎక్కడున్నారు. ఇంతకంటే మొండి సీఎంలను చాలామందిని చూశాం.


అందరితో సమన్వయం చేసుకోకుండా నియతంగా వ్యవహరిస్తే మేమే కాదు. పార్టీ దెబ్బతినే పరిస్థితి ఏర్పడితే హైకమాండే ఊరుకోదు’ అని ఓ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.చివరకు సీనియర్‌ జానారెడ్డి సైతం కిరణ్‌ అనుమతి తీసుకుని మునిసిపాలిటీల్లో తాగునీటి సమస్యలపై ప్రస్తావించవలసిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి వల్ల మంత్రులు సరిగా పనిచేయలేకపోతన్నారని, ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. కిరణ్‌ను గాడిలోకి పెట్టకపోతే పరిస్థితి చేయిదాటిపూయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంను పిలిచి మంత్రులతో సఖ్యతగా ఉండాలని ఆదేశించవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్‌కూ బొత్స ఇదే విషయం స్పష్టం చేశారు.

గంభీర వాతావరణం
కాగా.. తొలిరోజు సమావేశంలో మంత్రులు విరుచుకుపడిన వైనం మీడియాలో ప్రముఖంగా రావడంతో రెండవ రోజు గంభీర వాతావరణం నెలకొంది. డికె అరుణ, రఘువీరారెడ్డి మీడియా వద్దకు వచ్చి తొలిరోజు ఎలాంటి గొడవ జరగలేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రఘువీరారెడ్డి మాత్రం మీడియాది రాక్షస ఆనందం అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సైతం మీడియాను పట్టించుకోవలసిన పనిలేదని తన సహజ శైలిలో వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment